EB NEWS/మణుగూరు:
భద్రాద్రి జిల్లాలో దొంగల బీభత్సం మరోసారి బయటపడింది. మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటపతి నగర్ ప్రాంతంలో కోడిపుంజుల వాగు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు కింద పడవేసి దానిలోని రాగి, అల్యూమినియం సామగ్రిని అపహరించారు.
ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఉదయం పంటలకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లిన రైతులు ట్రాన్స్ఫార్మర్ నేలకూలి ఉండటాన్ని గమనించారు. కరెంట్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ ప్రాణాలకు తెగించి దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడంతో మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన వేళ ఇలాంటి ఘటనలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయని వాపోతున్నారు.
ఊరికి సమీపంలోనే దొంగతనాలు జరగడం ఆందోళనకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి దుండగులను పట్టుకొని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్ను పోస్ట్ చేయండి