EB NEWS/తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉంటుండగా, మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం వడగండ్ల వానలు కురిశాయి. ఈ వడగండ్ల వానలతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశముండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలుచోట్ల పొలాల్లో నిల్వ ఉన్న పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వడగండ్ల వానల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

إرسال تعليق