రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి- జిల్లా ఎస్పీ

G Rajashekar
By -
0




Arrive Alive-2026 లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలి.---జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్----


EB NEWS/భద్రాద్రి:


రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Arrive Alive కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడంతోపాటు,ఇతర శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.


Arrive Alive-2026 లో భాగంగా ఈనెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆరు రోజులు పాటు ఇతర శాఖల సమన్వయంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలకు జిల్లా ప్రజలు,వాహనదారులు భాగస్వాములు కావాలని కోరారు.స్వీయ తప్పిదాల వలన రోడ్డు ప్రమాదాలలో ప్రతి ఏడాది ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటి వారి ప్రాణాలతో పాటు,మన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించే విధంగా సివిక్ సెన్స్ ను కలిగి ఉండాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాలపై ఇకపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు.


*కార్యక్రమాల వివరాలు*


👉*Day-1* 13వ తేదీ సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలు,యువతకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం.


 👉*Day-2* 14 వ తేదీ మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ఇతర శాఖల అధికారులతో కలిసి అక్కడ మరమ్మత్తు కార్యక్రమాలను చేపట్టడం.


👉*Day-3* 15వ తేదీ బుధవారం స్కూళ్ళు,కళాశాలలోని విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం. స్కూళ్ళు,కళాశాలల బస్సుల డ్రైవర్లకు అవగాహనా సదస్సులు


👉*Day-4* 16వ తేదీ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారి లైసెన్సులు,యూనిఫామ్ మరియు ఇతరత్రా తనిఖీలు నిర్వహించడం.


 👉 *Day-5* 17వ తేదీ శుక్రవారం యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో చేయవలసిన ప్రధమ చికిత్స,స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం.


👉*Day-6* 18వ తేదీ శనివారం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వాహనదారులకు జరిమానాలను విధించడం,ఆపై వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల నిర్వహణ.


జిల్లా వ్యాప్తంగా ఆరు రోజుల పాటు ఇతర శాఖల సమన్వయంతో యువత,ప్రజలు,వాహనదారులను చైతన్యపరిచే ఇట్టి కార్యక్రమాలకు పోలీస్ వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్బంగా ఎస్పీ కోరారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)