ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి. పాటిల్‌




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అధికారులను ఆదేశించారు.


 బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటి అంశాలపై ఆయన అదనపు కలెక్టర్‌ డి. వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తన బాధ్యతను కట్టుదిట్టంగా, సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.


పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు సెన్సిటివ్‌ మరియు హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను గుర్తించి సంబంధిత పోలీస్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు.


మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలపై సంబంధిత సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ నామినేషన్‌ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు.


రిటర్నింగ్‌ ఆఫీసర్లు స్వీకరించిన నామినేషన్లను అదే రోజు Te-Poll సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ప్రతి రోజు సాయంత్రం నాటికి రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. తహసీల్దార్లు (మండల MCC నోడల్‌ అధికారులు) SST, FST బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్‌ అధికారులకు పంపాలని సూచించారు. ZPTC నామినేషన్ల ప్రక్రియ సంబంధిత RDO / సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు.


తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బ్యాలెట్‌ పేపర్‌ తయారీ మరియు ముద్రణను తెలుగు వర్ణమాల క్రమంలో ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సామాగ్రిని కేంద్రాల వారీగా వేరు చేసి భద్రంగా ఉంచాలని ఎంపీడీఓలను ఆదేశించారు.


రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ర్యాలీలు, సమావేశాలు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి సంబంధించి SHO / CI ల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్‌ సూచించారు.


నామినేషన్ల స్వీకరణ అక్టోబర్‌ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి అక్టోబర్‌ 11వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు జరగనుంది. అక్టోబర్‌ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 13న అప్పీల్‌ స్వీకరణ, అక్టోబర్‌ 14న అప్పీల్‌ విచారణ జరగనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అక్టోబర్‌ 15వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉండగా, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు.


జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా, సమన్వయంతో నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నోడల్‌ అధికారులు అన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.


 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది