EB NEWS/అశ్వాపురం:
అశ్వాపురం మండలం కట్టంవారిగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్వాడీ భవనం నాణ్యత లోపాలతో నిర్మించబడుతోందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారుల భవిష్యత్తుకు బలమైన ఆశ్రయంగా నిలవాల్సిన ఈ భవనం, నిర్మాణ దశలోనే బలహీనతలను చూపుతుండటంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. భవనం సన్ సైడ్ కోల్పోతున్న దృశ్యాలను చూస్తుంటే, పూర్తయిన తరువాత ఇది ఎంతవరకు సురక్షితంగా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
“ఇలా నిర్మిస్తే రేపు మా పిల్లలు ఇందులో ఎలా కూర్చుంటారు?” అని తల్లిదండ్రులు వేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణమవుతున్న ఈ అంగన్వాడీ నాణ్యతలేకుండా కట్టబడితే చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతను పక్కన పెట్టి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్సును రద్దు చేసి, ప్రమాణాలకు అనుగుణంగా కొత్తగా భవనం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఈ విషయంపై సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నాణ్యమైన అంగన్వాడీ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్ను పోస్ట్ చేయండి