EB NEWS/ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా సినీ తరహా మలుపు తిరిగిన ఘటన కలకలం రేపింది. ఫస్టియర్ ఆంగ్ల పరీక్షలో అసలు విద్యార్థి బదులుగా మరొక యువకుడు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు చిక్కిపోయాడు.
ఓఎంఆర్ షీట్పై సంతకం చేయించే సమయంలో చేతిరాతలో తేడా గమనించిన పర్యవేక్షకులు అప్రమత్తమయ్యారు. సంతకం సరిపోలకపోవడంతో విద్యార్థిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో అక్కడికక్కడే యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోందని తెలిపారు.
ఈ సంఘటనతో పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలపై మరింత దృష్టి సారించారు అధికారులు. పరీక్షల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

إرسال تعليق