EB NEWS/MANUGURU:
పాత గొడవల నేపథ్యంలో యువకుడు సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ హత్యకు గురైన ఘటనపై మృతుడి కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగి ఇంత సమయం గడుస్తున్నా నిందితులను పోలీసులు పట్టుకోకపోవడంపై వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబీకులతో మాట్లాడి ఆందోళన విరమించేలా ప్రయత్నించారు.
పోలీసుల జోక్యంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ర్యాలీగా బయలుదేరారు. కాగా, హత్యకు పాల్పడిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని స్థానికులు, మృతుడి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

