ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం

 


ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:

తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. ఇటీవల అసిఫాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. మీకు లెక్కలేదా అని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. అయినా ప్రభుత్వ హాస్టల్స్‌లో సిబ్బంది తీరు మారటం లేదు.

 తాజాగా.. వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో మంగళవారం (డిసెంబర్ 10) పుడ్ పాయిజన్ అయింది. ఉదయం ఉడకని కిచిడీ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు ఎస్సీ హాస్టల్‌లో 3 నుంచి 8 తరగతులు నిర్వహిస్తుండగా.. 9 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థినులు పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువును కొనసాగిస్తున్నారు. అన్ని తరగతులకు కలిపి ప్రస్తుతం హాస్టల్‌లో 160 మంది బాలికలు ఉన్నారు. వీరంతా మంగళవారం ఉదయం 8 గంటలకు హాస్టల్‌లో అల్పాహారంగా కిచిడీ తిన్నారు.

 అయితే 10 గంటల సమయంలో కిచిడీ తిన్నవారిలో తొమ్మిది మంది విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చింది. దీంతో సిబ్బంది వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులై కడుపునొప్పి బారినపడ్డారు. వీరిలో నలుగురిని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మిగిలిన ముగ్గురిని వసతి గృహంలోనే ఉంచి ట్రీట్‌మెంట్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విషయం తెలుసుకున్న ఎమ్మార్వో తారాసింగ్, మండల విద్యాధికారి వెంకటయ్య హాస్టల్‌కు వెళ్లి విచారించారు.

హాస్టల్‌లో ఇబ్బందులు పడుతున్నామని పలువురు బాలికలు వారి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌కు నివేదిక అందిస్తామని అధికారులు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم