ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కీలక పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేసేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ అన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పారదర్శకత పాటించాలని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఈ పథకాలన్నింటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఆ వివరాలను గ్రామాల్లో గ్రామ సభలు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు, డివిజన్ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ పథకాల కోసం అర్హుల వివరాలు, లబ్ధిదారుల జాబితాను ఆ సభల్లోనే ప్రకటించాలని తెలిపారు. ఈనెల 15వ తేదీ లోగా అన్ని పథకాల అమలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని ఇంఛార్జ్ మంత్రుల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈనెల 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
